Tuesday 30 December 2014

గ్రామ పంచాయతీలు నిర్వీర్యం..?

రాజధాని పరిపాలన కోసం ఏర్పాటు చేసిన సిఆర్‌డిఎ చట్టం కార్పొరేట్లకు అనుకూలంగా ఉందనీ, దీనిని తక్షణమే సవరించాలనీ సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు  బివి.రాఘవులు డిమాండ్‌ చేశారు.మార్క్సిస్టు అగ్రనేత మాకినేని బసవపున్నయ్య శత జయంతోత్సవాల్లో భాగంగా మంగళవారం బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన 'నవ్యాంధ్ర నిర్మాణం' అనే అంశంపై బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సంపర దుర్గ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడారు. సిఆర్‌డిఎ పరిధిలోని గ్రామ పంచాయతీల గురించి బిల్లులో ఎక్కడా పొందుపరచలేదన్నారు. దీంతో గ్రామ పంచాయతీలు ఉంటాయా లేక రద్దవుతాయా అనే సందిగ్ధం నెలకొందన్నారు. ఈ చట్టం రైతులకు అన్యాయం జరిగే విధంగా ఉందని తెలిపారు. రాజధానికి భూములిచ్చే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.రాజధాని నిర్మాణానికి దేశంలో ఉన్న మేథాసంపత్తిని ఉపయోగించుకోకుండా సింగపూర్‌ వారిపై ఆధారపడటం మంచిదికాదన్నారు. . నూతన రాజధాని పరిపాలనా రాజధానిగా ఉండాలే కానీ మహానగరంగా ఉండకూడదన్నారు. రైతుల భూముల్లో ప్రభుత్వం భవనాలు నిర్మించుకోవాలని చూస్తోందని, అందువల్ల ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేసేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం మహానగరానికీ, రాజధానికీ లింకు పెడుతోందని పేర్కొన్నారు. ఏ దేశమైనా ఓడరేవులు, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడం ద్వారానే అభివృద్ధి సాధించిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 

No comments:

Post a Comment