Saturday 31 January 2015

బలిపీఠంఫై భారత్..?

రిపబ్లిక్‌ డే రోజున 'విశిష్ట అతిథి'గా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా మూడురోజులపాటు భారత్‌లో హల్‌చల్‌ చేశారు.అమెరికా తన 'దక్షిణ ఆసియా ఇరుసు'కు మేకుగా భారత్‌ను మార్చాలనే ఆలోచనలో ఉన్నది. ప్రపంచ స్థాయిలో ప్రాబల్యంగల రాజ్యంగా అవతరించాలనే కాంక్ష భారతీయ పాలక వర్గాలను అమెరికా పెట్టుబడులపై ఆధారపడేలా చేస్తున్నది. దానికి అనుగుణంగానే ఒబామా-మోడీలు తాజాగా 10 సంవత్సరాల సైనిక సహకార ఒప్పందాన్ని కొనసాగించటానికి పరస్పర అంగీకారం కుదిరినట్లు ప్రకటించారు. భారత్‌-అమెరికా సంయుక్త రక్షణ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం చొరవ(డిటిటిఐ)లో భాగంగా నాలుగు రక్షణ వ్యవస్థల ఉత్పత్తులు మొదలవుతాయని ఒబామా-మొడీ ప్రకటించారు. ఈ చొరవ ప్రధానోద్దేశం ఏమంటే భారత్‌ తన రక్షణావసరాలకై అమెరికాపై ఆధారపడేలా చేయటం. అంతేకాకుండా దీర్ఘకాలంగా కొనసాగుతున్న భారత్‌-రష్యా స్నేహ బంధాన్ని నాశనం చేయటం కూడా ఈ వ్యూహంలో భాగమే. ఆసియా-పసిఫిిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతం గురించి ఒబామా-మోడీ సంయుక్త ప్రకటనలో వెల్లడించిన అభిప్రాయం దక్షిణ చైనా సముద్రంలో తూర్పు ఆసియా దేశాలకు, చైనాకు మధ్య వివాదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నది. 2010లో భారత పార్లమెంటు చేసిన పౌర అణు నష్టపరిహారం బాధ్యత ఒప్పంద చట్టం అణు ప్రమాదం జరిగినప్పుడు ప్రజలకు పరిహారం చెల్లించే బాధ్యతను అణు రియాక్టర్లు సరఫరా చేసిన కంపెనీపై ఉంచింది. అయితే మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి బాధ్యతను భారత దేశ ప్రజలపైకి నెట్టింది. అంతిమంగా చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానానికి అనుబంధంగా భారత విదేశాంగ విధానాన్ని మార్చటానికి మోడీ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. అంటే అమెరికా కాంక్షించే ఏక ధృవ ప్రపంచంపై ఆధిపత్యాన్ని చలాయించటానికి సహాయపడే వ్యూహాత్మక భాగస్వామిగా భారతదేశం మారబోతున్నది.

Friday 30 January 2015

బిజెపి,టిడిపిల ప్రత్యేక దగా !

నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన సాధ్యం కాకపోవచ్చంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పడం,ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో మీడియాకు లీకులివ్వడం రాష్ట్ర ప్రజలను మరోసారి దగా చేయడమే! బిజెపి రెండు నాల్కల ధోరణికిది నిదర్శనం కాగా ఆ పార్టీతో చంద్రబాబు లాలూచీ వ్యవహారానికి మరో దృష్టాంతం.కేంద్రం, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారాని కొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయ ప్యాకేజీ వంటివి అమలు చేయించడం తేలికవుతుందని చెప్పి ఓట్లు పొంది ఇలా దగా చేయడం ఆ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య.

ప్రజా రాజధాని కాదు కార్పొరేట్ అడ్డా..బివి రాఘవులు

రాజధాని ప్రజా రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం పూర్తిగా కార్పొరేట్‌ రాజధానిగానే నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది.కడుపులో నీళ్లు కదలకుండా విమానాల్లో, కోట్ల విలువైన కార్లలో తిరుగుతూ కాలం గడుపుతున్న వారి చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వం తీసుకోవచ్చు. రాజధాని నిర్మాణంలో కీలకమైన కృష్ణానది కరకట్ట భాగంలో ఉండవల్లి నుంచి బోరుపాలెం వరకూ ఉన్న పది గ్రామాలను పూర్తిగా పోలీసులతో నింపేసింది. పెద్దల చేతుల్లో కృష్ణానదికి ఆనుకుని ఉన్న భూములు, వాటిల్లో ఉన్న నిర్మాణాల జోలికెళ్లడం లేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి బోటులో వెంకటపాలెం వరకూ వెళితే నదిని ఆక్రమించి, పూడ్చి నిర్మించిన లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు కనిపిస్తాయి. అందమైన, అధ్భుతమైన నిర్మాణాలు, వీటిల్లో ఏ ఒక్క భవనానికీ నదీ పరీవాహక పరిరక్షణ చట్టం నుంచి మినహాయిస్తున్నట్లు(ఎన్‌ఓసి) అనుమతులు లేవు. యథేచ్ఛగా నిర్మించేశారు. గతంలో అధికారం వెలగబెట్టిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. నిర్మించినవారిలో ఎక్కువమంది ఆయా పార్టీలకు చెందినవారే ఉన్నారు.కరకట్ట వెంబడి ఉన్న పొలాలన్నిటినీ  బిజెపి పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు(ఎంపి) గోకరాజు గంగరాజు స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్‌ భూములూ లీజు పేరుతో ఆయన చేతుల్లోనే ఉన్నాయి. నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ లేని నిర్మాణాలు 2.53 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే వాటిల్లో గంగరాజుకు చెందినవే 58 సెంట్లలో ఉన్నాయి. దీనిలో నదిని పూర్తిగా ఆక్రమించి హంగూ, ఆర్భాటాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన విడిది భవనమూ ఉంది.  రాజధాని భూ సమీకరణ ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే తన పొలాలు, భవనాల మధ్యలో ఉన్న అరెకరం స్థలాన్ని శ్యాంప్రసాద్‌ ముఖర్టీ ట్రస్టుకు బిజెపి ఎంపి గంగరాజు రాసిచ్చినట్లు తెలిసింది. దీనిలో భవన నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్దిశాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇటీవల శంకుస్థాపన చేశారు. . తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు చెబుతున్న పారదర్శకత అనే పదానికి అర్థం వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రజా రాజధాని అన్నమాటకు విలువ లేకుండా పోతుంది.పేదలన్నా, రైతులన్నా ఏ మాత్రమూ కనికరం లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు కన్నబిడ్డల్లాంటి పొలాలను లాక్కుని కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం కట్టబెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.  

Sunday 11 January 2015

మోడీ ప్రభుత్వ ఆరు నెలల పాలన..

క్లుప్తంగా చెప్పాలంటే.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి ప్రమాదం కొనితెస్తోంది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసి విదేశీ, స్వదేశీ పెట్టుబడుదారులకు లాభాలు తెచ్చే బిల్లులను ఆర్డినెన్స్‌ రూపంలో తెస్తోంది. ఒకప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ తెచ్చేవారు. ఈ ఆరు నెలల్లో తొమ్మిది ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చారు.'' ఏదైనా బిల్లు ఆమోదించాలంటే పార్లమెంటులో చర్చకు పెట్టాలి. బిజెపి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇన్స్యూరెన్స్‌ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి, కోల్‌మైనింగ్‌ను ప్రయివేటీకరించటానికి ఆర్డినెన్స్‌ తేవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా అభ్యంతరం చెప్పారు. జాతి సమగ్రతను కాపాడే లౌకికత్వాన్ని తుంగలో తొక్కు తున్నారు. మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు, ప్రాంతాల మధ్య చీలికలు తెస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందే విధానాలను అనుస రిస్తున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ ఇంత ప్రచారం చేశాక పారిశ్రామికరంగం, ఉత్పత్తి రంగంలో గ్రోత్‌ రేటు -4.1 శాతానికి పడిపోయింది.ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు సగం తగ్గాయి. దాని ప్రకారం భారతదేశంలో లీటరు పెట్రోలు రూ.35కి, డీజిల్‌ రూ. 30కి రావాలి. కానీ అలా జరగలేదు. పెట్రోలు ధరలు తగ్గిన మూడు సార్లు ఎక్సైజ్‌ డ్యూటీని ప్రభుత్వం పెంచింది. ఒక్కోసారి రూ.70 వేల కోట్లు చొప్పున మూడు సార్లు పెంచడంతో ప్రభుత్వానికి రూ. 2.10 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. కానీ ప్రజలమీద భారం మాత్రం అలాగే ఉంది.

సిపిఎం జాతీయ మహాసభల పైలాన్‌..

ఏప్రిల్‌ 14 నుంచి 19 తేదీల్లో విశాఖ నగరం లో జరగనున్న సిపిఎం 21వ అఖిల భారత మహా సభలకు సూచికగా విశాఖనగరంలోని డాబాగార్డెన్స్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద సుమారు 50 అడుగుల ఎత్తున ఏర్పాటైన పైలాన్‌పై ఒక వైపున మార్క్స్‌, ఏంగిల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌, చేగువేరా ఫొటోలను ఏర్పాటు చేశారు. మరోవైపున సిపిఎం అగ్రనేతలు కీర్తిశేషులు ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, జ్యోతిబసు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎకె గోపాలన్‌, పి.రామ్మూర్తి, ప్రమోద్‌దాస్‌ గుప్తా, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, బిటి రణదేవ్‌, మాకినేని బసవపున్నయ్య ఫొటోలను ఏర్పాటు చేశారు. 'ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివేయాలి, కార్మిక చట్టాలపై ప్రభుత్వ దాడిని విడనాడాలి, నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించాలి, ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయాలి' వంటి నినాదాలు పైలాన్‌పై ఉన్నాయి. ఈ ఫైలాన్‌ చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ మోదీ..

" దేశంలో 3 ప్రధాన సమస్యలు రాజకీయ త్రిమూర్తులుగా తయారయ్యాయి. ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ.. వాజ్‌పేయి కాలంలోని మతతత్వం.. మన్మోహన్‌ హయాంలోని నూతన ఆర్థిక విధానాలు కలిపితే మోడీ పాలన. ఈ మూడింటిని అడ్డుకోగలగడంపైనే వామపక్షాల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ ప్రమాదాల నుంచి దేశాన్ని వామపక్షాలు తప్ప మరెవ్వరూ కాపాడలేరు "..  సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి. 

ఉవ్వెత్తున ఎగసిన ఎర్రజెండా..

సిపిఎం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంతో పాటు విజయవాడలో ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని శనివారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అరుణ పతాక యాత్రతో విజయవాడ నగరంఎరుపెక్కింది.వన్‌టౌన్‌లోని రథం సెంటరు నుంచి ప్రారంభమైన యాత్రలో 50 మీటర్ల మేర అరుణ పతాకాన్ని చేబూని రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు లెనిన్‌ సెంటరు వరకు కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే సిపిఎం ధ్యేయమన్నారు. ప్రభుత్వాలు మారినా పాలకుల విధానాల్లో మాత్రం మార్పు రావడం లేదన్నారు. మరో 20 ఏళ్లు పరిపాలన చేయాలని తెలుగుదేశం పార్టీ, 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ సిపి, పోగొట్టుకున్న అధికారాన్ని, పదవులను ఎలా దక్కించు కోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేస్తున్నాయన్నారు. వామపక్ష పార్టీగా సిపిఎం మాత్రం పదవులతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. దేశ సమైక్యత, మత సామరస్యం పెంపొందించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్‌ చుట్టూ తిరుగుతూ రాష్ట్రంలోని యువత నైపుణ్యాన్ని నిరుత్సాహపరిచే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.  

Friday 9 January 2015

టి.డి.పి నయా ఉదారవాద జిమ్మిక్కులు.. !

రాజకీయాలను, పార్టీని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా నడిపిస్తూనే, మరో వైపున ప్రజలకు, కార్యకర్తలకు ప్రయోజనం కల్పిస్తున్నామన్న భ్రమల్లో ముంచే నైపుణ్యాన్ని తెలుగుదేశం నేతలు బాగా వంటబట్టించుకున్నారని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి సి.హెచ్‌ బాబూరావు అన్నారు.దేశంలో ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలమైన విధానాలు తీసుకుంటున్నాయని,తెలుగుదేశం పార్టీ మరొక అడుగు ముందుకు వేసి తమ పార్టీనే కార్పొరేట్‌ సంస్థగా మార్చేసి కార్పొరేట్‌ కంపెనీలకు మార్కెటింగ్‌ చేస్తోందన్నారు.మా పార్టీలో క్రియాశీల సభ్యులుగా చేరితే బీమా సదుపాయం, బస్సులలో ప్రయాణిస్తే 10 శాతం, ఆసుపత్రులలో 10 నుంచి 50 శాతం వరకు ఫీజులో తగ్గింపు అంటూ ప్రచారం చేస్తూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెట్టే పనిలో బిజీగా ఉంది.100 రూపాయలు కడితే క్రియాశీల సభ్యత్వం, దానితోపాటే అనేక రాయితీలు అంటూ టిడిపి నేతలు హంగామా చేస్తున్నారు. సభ్యులుగా చేరినవారు ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా, అంగవైకల్యం ఏర్పడితే 50 శాతం నుంచి 100 శాతం బీమా అని ఊరిస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో చేరి, తమ జెండా పట్టుకున్న వారికే బీమా సౌకర్యం కల్పిస్తారా? రాష్ట్రంలోని పేదలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, పొదుపు సంఘాల సభ్యులు, ఇతర వర్గాల వారు అర్హులు కారా? అని ప్రశ్నించారు.పార్టీ అధినేత చంద్రబాబు పనితీరు, వారి ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరండని చెప్పుకోలేక ఇన్సూరెన్స్‌ కోసం తమ పార్టీలో చేరండని ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ బలమా? బలహీనతా?. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కేశినేని ట్రావెల్స్‌ బస్‌లలో ప్రయాణిస్తే 10 శాతం ఛార్జీలలో రాయితీలను ప్రకటించారు. అంటే ప్రయాణికులను ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించవద్దు, ప్రైవేట్‌ బస్‌లలోనే ప్రయాణం చేయండని తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తున్నది. ప్రభుత్వ రంగాన్ని, ఆర్టీసీ సంస్థను నాశనం చేసి ప్రైవేట్‌ బస్‌ల యాజమాన్యానికి ప్రయోజనం కలిగించడానికి బహిరంగంగా అధికార పార్టీ ప్రచారం చేయడం నీతిమాలిన చర్య కాదా?. రాష్ట్రంలోని 27 కార్పొరేట్‌ ఆసుపత్రులలో తెలుగుదేశం క్రియాశీల సభ్యులకు 10 నుంచి 50 శాతం వరకు రాయితీలు అంటూ మరొక సౌకర్యం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు కేటాయించకుండా వాటిని నాశనం చేసి కార్పొరేట్‌ ఆసుపత్రులకు రోగులను పంపే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోవడం ఆ పార్టీ నైజాన్ని తెలుపుతున్నది. కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు దళారీ వ్యవస్థను పెట్టుకుని రోగులను పంపిన వారికి కమీషన్లు ఇస్తాయి. మరి తెలుగుదేశం సభ్యులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు పంపే విధానాన్ని ప్రకటించిన ఈ పార్టీని ఎలా పరిగణించాలి.పార్టీ, ప్రభుత్వ అధికారాన్ని సొంత ప్రయోజనాల కొరకు వాడుకోవడం, దానిని బహిరంగంగా సమర్థించు కోవడంలో తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకేసింది.

Thursday 8 January 2015

ప్రపంచబ్యాంకు ఉగ్గుపాలతో పెరిగిన చంద్రబాబు...ఎం.ఎ గఫూర్

చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక ఉద్యమాలను అణచివేసి పెట్టుబడిదారుల మొదటి జీతగానిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని సి.పి.ఎం కేంద్ర కమిటి సభ్యులు ఎం.ఎ గఫూర్ అన్నారు. ప్రపంచబ్యాంకు ఉగ్గుపాలతో పెరిగిన చంద్రబాబు ఏమాత్రం అవకాశం దొరికినా ఆ విధానాలను అమలుజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఓట్లువేసిన ప్రజలు కాకుండా ఎన్నికల నిధులు ఇచ్చిన పెట్టుబడిదారులే ముఖ్యమని, వారి సేవకు తను సర్వదా సిద్ధమనే సంకేతాన్ని ఇస్తున్నారు.స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మించాలంటే రాష్ట్రంలోని సహజ వనరులతో పాటు మానవ సంపదను కూడా కారుచౌకగా కొల్లగొట్టేందుకు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు హక్కుగా ఇవ్వాలనేది చంద్రబాబు నమ్ముతున్న సిద్ధాంతం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులను అణచివేయడమే మార్గంగా భావించి కార్మికోద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. యానిమేటర్ల సమ్మెపై అణచివేత చర్యలు, అంగన్‌వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యం, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల వ్యతిరేకత, కృష్ణపట్నం, గంగవరంపోర్టు, అరవిందో ఫార్మా, తదితర కార్మికులపై పోలీసుల జులుం, కార్మిక సంఘాల పట్ల, వామపక్ష ఉద్యమాల పట్ల చంద్రబాబు చూపుతున్న అసహనం ఆయనలో దాగున్న నియంతృత్వాన్ని ముందుకు తెస్తున్నాయి.ఇందిరా క్రాంతిపథం (వెలుగు)లోని 20 వేల మంది యానిమేటర్లు ప్రధానంగా మహిళలు గత 12-15 సంవత్సరాలుగా ఎలాంటి వేతనాలు లేకుండానే వెట్టిచాకిరి చేస్తున్నారు.గతంలో అంగన్‌ వాడీలను గుర్రాలతో తొక్కించిన, విద్యుత్‌ ఉద్యమంపై కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు మరోసారి అందరికీ గుర్తుకు వచ్చారు.భారత దేశంలోకి పరిశ్రమలు రావాలంటే కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను కుదిస్తే తప్ప సాధ్యం కాదని ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోజూ ప్రకటనలు చేస్తున్నారు.రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఋణమాఫీ ఒక ప్రహసనంగా మారింది. ఉపాధి హామీ పథకం నీరుగార్చబడింది. రైతు ఋణమాఫీలో కౌలుదార్లకు ఒరిగిందేమీలేదు. వ్యవసాయ కూలీలు వలసలు పోతున్న రాయలసీమలో ఆదుకునే దిక్కేలేదు. నిరుద్యోగ భృతి శుష్క ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయింది. విద్యార్థుల ఫీజ్‌ రీయింబర్స్‌మెంటు, హాస్టల్‌ ఛార్జీల పెరుగుదల ఊసే ప్రభుత్వం మరిచిపోయింది. ఈ పరిస్థితుల్లో కార్మికులు మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రజలు తమతమ డిమాండ్ల సాధనకై సమైక్య సమరానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

ఏడు లక్షల మంది కార్మికులు ఒకే తాటిపైకి..

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసే ఏడు లక్షల మంది కార్మికులు భాగస్వాములై ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై తమ ఆగ్రహం వెలిబుచ్చడం సాధారణమైన విషయం కాదు.1977 తర్వాత అతి పెద్ద సమ్మె ఇదే.రెండు రోజులపాటు సాగించిన సమ్మెతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోల్‌ ఇండియాలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడం అసాధారణం.తెలంగాణాలోని సింగరేణిలోనూ కార్మికులు సమ్మె బాట పట్టారు.నయా ఉదారవాద విధానాల మత్తు తలకెక్కిన మోడీ సర్కారు బీమా, బ్యాంకింగ్‌, రక్షణ ఒకటేమిటి అన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకు, కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. బొగ్గు గనులను సైతం మినహాయించలేదు. కుసంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున ప్రతిఘటనకు సిద్ధం కావడం స్వాగతించదగింది. తొలి మెట్టుగా బొగ్గు సమ్మె సరికొత్త చరిత్ర లిఖించింది.ఇప్పటికే ఓపెన్‌కాస్ట్‌ వంటి చర్యలతో బొగ్గు గనుల్లో కాంగ్రెస్‌ సర్కారు ప్రైవేటీకరణ చేపట్టగా బిజెపి మరింత వేగంగా కొనసాగించడం దారుణం. రూ.లక్షల కోట్ల బొగ్గు స్కాంకు మూలం ప్రైవేటీకరణే. 'సంస్కరణ'ల రంధితో కన్నూ మిన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బొగ్గు సమ్మె గట్టి సవాల్‌ విసిరింది. బొగ్గు గనుల్లో వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా జాతీయ స్థాయిలోని ప్రధాన కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా సమ్మెకు నడుం కట్టడం హర్షణీయం.

Wednesday 7 January 2015

600 ఎకరాల లంకభూములు స్వాహా..?

రాజధాని ప్రాంతంలోని లంక భూములపై టిడిపి ప్రజాప్రతినిధుల కన్ను పడింది.తుళ్లూరుకు కిలోమీటరు దూరంలో ఉన్న రాయపూడి రెవెన్యూ గ్రామం, బోరుపాలెం గ్రామ పరిధిలో 600 ఎకరాల లంక భూమి ఉంది. ఇక్కడ పర్యాటక ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే నలుగురు మంత్రులు, ముగ్గురు ఎంపిలు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు దీని కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.స్వయంగా పరిశీలించిన కొందరు కొంత భూమి కొనుగోలుకు రైతులతో బేరసారాలూ సాగించారు.600 ఎకరాల లంక భూమిలో కొద్దిమంది రైతుల చేతుల్లో 258 ఎకరాలు పట్టా భూమి ఉంది. భూ సమీకరణలో భాగంగా ఈ భూమిని తీసుకోవాలా, వద్దా అనే అంశంపై ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చ చేయడంతో అందరి దృష్టి దీనిపై పడింది. వీటిని తీసుకోని పక్షంలో పర్యాటక ప్రాజెక్టులకు కేటాయిం చాలని ఆలోచన చేసినట్లు తెలిసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి బోరుపాలెం వరకు ఎనిమిది లంకలున్నాయి. 138 ఎకరాల్లో భవానీద్వీపం కొంత పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉంది. మరో లంక ఉండవల్లి రెవెన్యూ 60 ఎకరాలకు పైబడి మరో లంక ఉంది. దీన్ని ఓ ఎంపి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. పండ్లతోటలు సాగుచేస్తున్నారు. దీంతోపాటు గొల్లపూడి రెవెన్యూ గ్రామం పరిధిలో దాదాపు 300 ఎకరాల పైబడి లంక తయారైంది. మందడం రెవెన్యూ గ్రామ పరిధిలో తాళ్లాయపాలెంలో మరో లంక ఉంది. ఇవి కాకుండా రాయపూడి పరిధిలో మూడు లంకలు ఉన్నాయి. వీటిల్లో పెదలంక ఉంది.ఇందులో 125 నివాసాలు కూడా ఉన్నాయి. పూర్తిగా పట్టాభూమి కావడంతో రైతులు కూడా ఆయా లంకల్లోనే ఉండి సాగు చేసుకుంటున్నారు. వీటన్ని టిలోనూ ఒక్క పెదలంకలోనే పట్టాభూమి ఉండ టంతో దాన్ని స్వాధీనం చేసుకునే దిశగా పెద్దలు వాలిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన వారే కావడంతో ఎలాగైనా కొనుగోలు చేసే పనిలో పడ్డారు. దీనికోసం అధికారులనూ వినియోగించుకుంటున్నారు.

అశాస్త్రీయ జనతా పార్టీ..

విద్యారంగంలో అశాస్త్రీయతను చొప్పించేందుకు బి.జె.పి ప్రయత్నిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య అన్నారు.దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో తమ వంతు కృషిని అందిస్తున్న ఎందరో భారతీయ శాస్త్రవేత్తలను అవమానపరిచేలా బి.జె.పి వ్యవహరిస్తోందన్నారు. వినాయకుడికి ఏనుగు ముఖాన్ని తగిలించడం ప్లాస్టిక్‌ సర్జరీయేననీ, కుంతీదేవికి కర్ణుడు జన్మించిన తీరు టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రక్రియ కన్నా పురోగామి అనీ ప్రధాని మోడీ అనడంచూస్తుంటే అశాస్త్రీయతకు బి.జె.పి కాషాయ జెండా ఊపుతోందని విమర్శించారు. వంద రోజుల్లోనే విదేశాలలోని నల్లధనం 75 లక్షల కోట్ల రూపాయలను బయటికి తెస్తానని హామీ ఇచ్చిన మోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఆ మొత్తాన్ని కార్పోరేట్లకే ఇస్తున్నారన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నినిర్వీర్యం చేయడంతోపాటు మోడీ అధికారంలోకొచ్చిన తర్వాత దేశంలో రెండువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మోడీ,చంద్రబాబు ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జగన్‌ ఏమీ మాట్లాడడం లేదని, బిజెపి సవాళ్ళను జగన్‌ స్వీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. వారికి ధీటైన సమాధానం చెప్పే శక్తి కేవలం సిపిఎం కే ఉందన్నారు.

Tuesday 6 January 2015

రుణమాఫీ తొలిదశలోనే విఫలం...

తొలిదశ రుణమాఫీ అమలులోనే రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు,బ్యాంకర్లు పూర్తిగా విఫలమయ్యారు. మాఫీకి బ్యాంకర్లు సహకరించక పోవడంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకర్లు రుణమాఫీకి సహకరించాలని కోరారు. రుణమాఫీలో రెండోదశ కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నందున తొలిదశను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.తొలిదశ రుణమాఫీనే ఇంకా పూర్తిగా ఆచరణకు నోచుకోని తరుణంలో రెండోదశ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలనే దానిపై గందరగోళం నెలకొనివుంది. 

9 లక్షల మంది రైతాంగానికి నష్టం...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమంగా భూ సమీకరణ ద్వారా రైతులకు అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నోరెత్తడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మండిపడ్డారు. ల్యాండ్‌ పూలింగ్‌ చట్టవిరుద్ధమని, ప్రభుత్వం రైతుల వద్ద బలవంతంగా భూములను గుంజుకుంటుందని ఇలాంటి తంతూ ఒక్క రాజధాని ప్రాంతంలోనే కాదని, విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల మంది రైతాంగం నష్టపోతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో 1.5లక్షల మంది దళితులు, గిరిజనులు ఉన్నారని వీరి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. భూ సమీకరణ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో కూడా అమలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రలోటు బడ్జెట్‌, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు వంటి అంశాల గురించి లేవనెత్తడం లేదని విమర్శించారు. ఈ చట్టవిరుద్ధమైన ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Monday 5 January 2015

చట్టబద్ధత లేని ల్యాండ్‌ పూలింగ్‌..

ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్ష విధానాలే ప్రత్యామ్నాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు.రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత లేని ల్యాండ్‌ పూలింగ్‌ విధానానికి పూనుకుందన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కంటే, ఈ విధానం రైతులకు మరింత తీవ్ర నష్టం చేకూరుస్తుందని తెలిపారు. చంద్రబాబు పాలనంతా రాజధాని నిర్మాణం చుట్టే తిరుగుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.రాజకీయాల్లో కుల, మతాలను జోడించి ప్రజల మధ్య చీలిక తేవాలని బిజెపి ప్రయత్నిస్త్తోందని తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భూ అధికరణ చట్టానికి తూట్లు పొడిచి, ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల రైతుల ఆమోదం లేకుండానే ప్రభుత్వం భూమిని లాక్కోవడానికి మరింత వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.ఉపాధి లేకే శ్రీకాకుళం జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు పలు ప్రాంతాలకు వలస వెళ్తున్న విషయాన్ని నర్సింగరావు గుర్తుచేశారు.

ప్రభుత్వ సమాచారం అమెరికా చేతుల్లో..

ఇరవై ఏళ్ల కిందట ప్రారంభమైన సరళీకరణ విధానాల దాడిని ఎదుర్కొనేందుకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా కదలాలని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియాను అడ్డుపెట్టుకుని బహుళజాతి కంపెనీలు దేశంపై డాడి చేస్తున్నాయన్నారు. ఇండియాలో కోటి వైబ్‌సైట్లు ఉంటే.. వాటి సర్వర్లు అమెరికాలో ఉన్నాయని వివరించారు. మన ప్రభుత్వ, ప్రయివేటు సమాచారం మొత్తం అమెరికా చేతుల్లో ఉందన్న విషయం మరవరాదన్నారు.దేశంతో న్యూక్లియర్‌ ఒప్పందం కుదుర్చుకొని ఈనెల 26న ఢిల్లీలో జరిగే మన రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్న ఒబమా పర్యటను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఆ రోజు నిరసన తెలపాలని ఆరు వామపక్షాలు పిలుపునిచ్చాయని గుర్తుచేశారు. మిలిటరీ శక్తి లేకుంటే అమెరికా ఎప్పుడో కుప్పకూలేదన్నారు. 50 ఏళ్ల నుండి క్యూబాపై అనేక ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు స్నేహహస్తం చాచడం వెనుక కారణాలు పరిశీలించాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, మోడీ మతోన్మాద కార్యక్రమాలను నిలువరించే దిశగా ఐక్య ఉద్యమాలు పెరగాలన్నారు. సరళీకరణ విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అంధకారంలో పడిందన్నారు. 

మసీదులు, చర్చిలు కూల్చాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కుయుక్తులు..

తిరుపతిలాంటి నగరాల్లో మసీదులు, చర్చిలు కూల్చాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కుయుక్తులు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేయడాన్ని లౌకికవాద శక్తులు తీవ్రంగా పరిగణించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు.రాష్ట్రంలోని టిడిపి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఈ విధానాల్ని తప్పుబట్టలేని హీన స్థితిలో ఉన్నాయని చెప్పారు.ఎన్‌డిఎ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు రెడ్‌కార్పెట్‌ పరుస్తూనే మతతత్వ అజెండాతో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌, పెట్టుబడిదారులకు అనుకూలంగా వుంటూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ భవిష్యత్తులో మరిన్ని భారాలు మోపే ప్రమాదముందన్నారు.కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎర్రజెండా ప్రత్యక్షమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

Sunday 4 January 2015

4000 కోట్లు వరకూ ప్రజలపై భారం.. వై.వి

విజయవాడ ప్రాంతంలో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, రాజధానికి భూములు ఎంత తీసుకుంటారు, ఏయే ప్రాంతాల్లో నిర్మిస్తారనే విషయాన్ని ఖచ్చితంగా ప్రకటించకుండా దాటవేస్తున్నారన్నారు. భూములు కోల్పోయే రైతులు, పేదలు, దళితులు, గిరిజనులు, చేతివృత్తిదారుల గురించి పాలకులు పట్టించుకోవటం లేదని చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు సంక్రాంతి తర్వాత పెంచేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. సుమారు రూ. 4000 కోట్లు వరకూ ప్రజలపై భారం మోపేందుకు రంగం సిద్ధంచేస్తున్నారన్నారు. పట్టణాలు, నగరాల్లో ఆస్తి, ఇతర పన్నులను పెద్దఎత్తున పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఇటీవల మున్సిపల్‌ శాఖమంత్రి నారాయణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే టిడిపి, బిజెపి పాలకులు కమ్యూనిస్టులపై సైద్ధాంతిక దాడికి దిగుతున్నారరి, దీన్ని ఎదుర్కొనాలంటే పార్టీ శ్రేణులు మారుతున్న పరిస్థితులకనుగుణంగా అధ్యయాన్ని పెంచుకోవాలని సూచించారు.

బూర్జువా పార్టీలతో సర్దుబాటు వైఖరి విడనాడాలి..

సిపిఎం కృష్ణా జిల్లా 22వ మహాసభలు మచిలీపట్నంలో జరిగాయి. ప్రతినిధులనుద్దేశించి రాఘవులు మాట్లాడుతూ బూర్జువా పార్టీలతో సర్దుబాటు వైఖరి విడనాడి, రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సివుందన్నారు.అసంఖ్యాకంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులను ఐక్యంచేసి వారికి అండగా జరిగే ఉద్యమాల్లో పార్టీ కీలకంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. విదేశీ పాశ్చ్యాత్యీకరణ నేపథ్యంలో మన సంస్కృతిపై ప్రపంచీకరణ దాడిని తిప్పికొట్టేందుకు ప్రజాసంస్కృతి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలు మరింత పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్య లపై కలిసొచ్చే సంఘా లను కలుపుక ుపోవాలని సూచిం చారు. 

Friday 2 January 2015

'నీతి మాలిన ఆయోగ్‌'

ప్రణాళికా సంఘాన్నిరద్దు చేసి, దాని స్థానే "నీతి ఆయోగ్‌" ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ వనరులను ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు మోడీ సర్కారు సైద్ధాంతిక తలుపులు తెరిచిందని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వం ఈ 'నీతి ఆయోగ్‌' వ్యవస్థను తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, ప్రజల జీవనం వంటి వాటిని నిర్వీర్యం చేసేందుకేనని ధ్వజమెత్తింది. ప్రభుత్వ రంగానికి జరుపుతున్న కేటాయింపులు, ప్రాంతీయ అసమానతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే ప్రణాళికా సంఘం పాత్రకు దీనితో తెరపడినట్టేనని వ్యాఖ్యానించింది.రాష్ట్రాల భాగస్వామ్యంతో సహకారాత్మక సమాఖ్య భావన ఆధారంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్న మోడీ సర్కారు ప్రకటన వట్టి బూటకమని,జాతీయాభివృద్ధి మండలి స్థానే ఏర్పాటు చేసిన పాలక మండలికి ఎలాంటి అధికారాలు లేవని, ఈ మండలి ప్రధాని, ప్రధాని కార్యాలయ ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఇది కేంద్రీకృత ఏకపక్ష వ్యవస్థ మాత్రమేనని  పేర్కొంది. కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు నిధుల కేటాయింపులన్నీ ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని, ఇది కేంద్ర ప్రభుత్వ రాజకీయ విచక్షణకు రాష్ట్రాలను బలిచేయటమేనని మార్క్సిస్టు పార్టీ విమర్శించింది. 'అన్నింటికీ ఒకే మంత్ర'మన్న ధోరణితో ఎటువంటి ఉమ్మడి మార్గదర్శకాలు, నియమ నిబంధనలు లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించటం ద్వారా కేంద్రం రాష్ట్రాలను తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తోందని విమర్శించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం రాజకీయ బేరసారాలకు తెరతీసిందని తెలిపింది.

రాష్ట్ర ప్రజలకు స్మార్ట్ షాక్..?

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ షాక్‌ ఇవ్వడానికి టి.డి.పి ప్రభుత్వం సిద్దమౌతోంది.నెలకు వందయూనిట్లకు మించి వినియోగించే వారికి ఛార్జీలు పెంచాలన్న ప్రాథమిక నిర్ణయానికి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సాగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. విద్యుత్‌ ఛార్జీల పెంపు అంశంపై గతంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని, అధికారాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రవేశపెట్టిన తరువాత తనకు అత్యవసరమైన సమావేశం ఉందని చెబుతూ ఆయన మంత్రిమండలి నుండి బయటకు వచ్చేశారు.ఈ సమావేశంలో కొందరు మంత్రులు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గత అనుభవాలను ప్రస్తావిస్తూ విద్యుత్‌ జోలికి వెళ్లడం మంచిదికాదన్న అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేశారు. అయితే, ఎక్కువ మంది మంత్రులు ఛార్జీల పెంపు ప్రతిపాదనను సమర్ధించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కూడా సమావేశంలో లేకపోవడంతో సంక్రాంతి తరువాత దీనిపై చర్చించి తుది నిర్ణయానికి రావాలన్న అభిప్రాయానికి మంత్రులు వచ్చారు.

ఇంకా 'రైతు రుణం' తీర్చుకోని ప్రభుత్వం..

అందరికీ రుణమాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టాల్సిన పని లేదని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టిడిపి, అధికారంలోకి వచ్చిన తర్వాత పలు షరతులతో మాఫీని అమలుచేస్తుండటంతో రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.ధ్రువీకరణ పత్రాలలో జాప్యం, ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు వివరాలను తప్పుగా నమోదు చేయడం, అసలు నమోదు చేయకపోవడం బీమా కార్డు ఆన్‌లైన్‌ చేయకపోవడం అర్హత ఉన్న కొద్ది మంది రైతుల వివరాలను అండర్‌ ప్రాసెస్‌గా నమోదు చేయడం, పెండింగ్‌ అంటూ కొందరు రైతుల పేర్లను వెబ్‌సైట్‌లో ఉంచటంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో జనవరి 9వ తేదీలోపు రైతులు అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. అందుకోసం జిఓ నెం.220ను విడుదల చేసింది. రైతులు క్షేత్రస్థాయిలో తహశీల్దార్‌, బ్యాంక్‌ మేనేజర్‌ మండల వ్యవసాయాశాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.ఈ దరఖాస్తులనీ జన్మభూమి కమిటీకి పంపిస్తామని, ఇంకా ధ్రువపత్రాలు ఇవ్వాల్సినవారు కమిటీకి రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకర్లు గురువారం ప్రకటించారు. దీంతో రైతులు మరోసారి కంగుతిన్నారు.
             అర్హత ఉన్నప్పటికీ అండర్‌ ప్రాసెస్‌ అని చూపిన రైతులకు రుణమాఫీని అమలుచేయరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలని ఒకసారి, నేడు జన్మభూమి కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని మరోసారి బ్యాంకర్లు, అధికారులు చెబుతున్నారు. తీసుకున్న ధరఖాస్తులన్నీ ఎప్పుడు ఆన్‌లైన్‌ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ యంత్రాగం చేసిన తప్పులకు రైతులను రుణమాఫీకి దూరం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల ప్రభుత్వోద్యోగులకు కూడా రుణమాఫీ వర్తించిన వైనాలున్నాయి.

Thursday 1 January 2015

మోడీ సర్కారు నియంతృత్వ పోకడలకు మరో నిదర్శనం.. 'ఆర్డినెన్స్‌ రాజ్‌'

  బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్సు రూటులో భూ సేకరణ చట్ట సవరణలు తీసుకురావడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది.సరళీకరణ విధానాలు రాకముందు దేశంలో 'లైసెన్స్‌, పర్మిట్‌ రాజ్‌' నడుస్తోందని బిజెపి నాయకులు విమర్శించేవారు. ఇప్పుడు వారు 'ఆర్డినెన్స్‌ రాజ్‌' సాగిస్తున్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. 'సమ్మతి' క్లాజును తొలగించడం, 'సామాజిక ప్రభావ మదింపు' అవసరం లేదనడం భూ సేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే! ఈ ఆర్డినెన్స్‌తో ప్రజా వ్యతిరేకమైన భూసేకరణ చట్టం (1894) తిరిగి అమలులోకి వచ్చినట్టవుతుంది.భూ సేకరణ చట్టంలో అత్యంత కీలకమైన 'సమ్మతి'పైనే ఈ ఆర్డినెన్స్‌ వేటు వేసింది. సమ్మతి అక్కర్లేదంటే గతంలో మాదిరిగా బలవంతపు భూ సేకరణ జరపొచ్చని చెప్పడమే గదా! సమ్మతి పొందాల్సిన ప్రజల శాతాన్ని 80 నుంచి 67కు తగ్గించాలని కార్పొరేట్‌ శక్తులు గతంలో కోరాయి. కానీ సర్కారు ఏకంగా 'సమ్మతి' అవసరమే లేదని ఆర్డినెన్స్‌ తేవడం ఆశ్చర్యకరం. బహుశా అందుకనే ఆర్డినెన్స్‌ ఆమోదించిన వెంటనే పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లూ హర్షం వెలిబుచ్చారు. సేకరించనున్న భూమిలో ఏ ప్రాజెక్టు నిర్మించేదీ, దాని ప్రభావం, అందుకు కనీసంగా అవసరమైన భూమి మొదలైన వివరాలన్నీ సామాజిక ప్రభావ మదింపు నివేదిక (ఎస్‌ఐఎ)లో ఉంటాయి. కనుక ఆ భూమి భవిష్యత్తు రూపం ఎలా ఉండేదీ, పర్యవసానాలు ఎలా ఉండబోయేదీ ప్రజలకు తెలుస్తుంది. ఇలాంటి అంశాలన్నిటినీ గ్రామసభలో చర్చించాక దాని సమ్మతి మేరకు సేకరణ చేపట్టాల్సి ఉండేది. కానీ ఆర్డినెన్స్‌లో సామాజిక ప్రభావ అంచనా నివేదికే అక్కర్లేదని చెప్పడంతో ఈ ప్రక్రియనంతటినీ గాలికొది లేసినట్టే. సుదీర్ఘ ఆందోళనలు, పోరాటాల ఫలితంగా వచ్చిన భూ సేకరణ, పునరావాస పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం పొందడానికీ పారదర్శకతకు హక్కు చట్టం(2013) ఇక 'కరి మింగిన వెలగ పండు' చందమే అవుతుంది. జాతీయ భద్రత, రక్షణ ఉత్పత్తులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం సహా సామాజిక మౌలిక సౌకర్యాల నిర్మాణం కోసం భూమిని సేకరిస్తే 'సమ్మతి' నిబంధన,  'సామాజిక ప్రభావ మదింపు' వర్తించవని కేంద్ర కేబినెట్‌ ఆర్డినెన్స్‌ ఆమోదించడం అప్రజాస్వామికం, అనైతికం.నీటిపారుదల సౌకర్యం కలిగి బహుళ పంటలు పండే భూములను సేకరించరాదని చట్టం నిర్దేశిస్తోంది. ఆర్డినెన్స్‌లో దాన్ని కూడా తొలగించడంతో చట్టం మరింత నిర్వీర్యం కావడమేగాక ఆహార భద్రతకు పెనుముప్పు కలుగుతుంది. ఇక ప్రజా ప్రయోజనం పరిధిలోకి ప్రైవేట్‌ హోటళ్లతో సహా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులనూ చేర్చడంతో భూ సేకరణ చట్టం బలవంతపు భూ స్వాధీన చట్టంగా మారిపోతుంది.భూ సేకరణ చట్టం (2013) కేవలం భూ యజమానులకు మాత్రమేగాక, ఆ భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, ఇతర పేదల ప్రయోజనాల రక్షణకు వీలు కల్పిస్తుంది. ఆర్డినెన్స్‌ ద్వారా ఆర్థిక పరిహారం కేవలం భూ యజమానులకు మాత్రమే లభిస్తుంది గనుక భూమిపై ఆధారపడి జీవించేవారి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసీముగియగానే బీమా రంగంలో ఎఫ్‌డిఐ పెంపు, బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఆర్డినెన్సులు తెచ్చిన బిజెపి సర్కారు ఇప్పుడీ ఆర్డినెన్స్‌ను చేయడం మరింత దారుణం.