Thursday 1 January 2015

మోడీ సర్కారు నియంతృత్వ పోకడలకు మరో నిదర్శనం.. 'ఆర్డినెన్స్‌ రాజ్‌'

  బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్సు రూటులో భూ సేకరణ చట్ట సవరణలు తీసుకురావడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది.సరళీకరణ విధానాలు రాకముందు దేశంలో 'లైసెన్స్‌, పర్మిట్‌ రాజ్‌' నడుస్తోందని బిజెపి నాయకులు విమర్శించేవారు. ఇప్పుడు వారు 'ఆర్డినెన్స్‌ రాజ్‌' సాగిస్తున్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. 'సమ్మతి' క్లాజును తొలగించడం, 'సామాజిక ప్రభావ మదింపు' అవసరం లేదనడం భూ సేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే! ఈ ఆర్డినెన్స్‌తో ప్రజా వ్యతిరేకమైన భూసేకరణ చట్టం (1894) తిరిగి అమలులోకి వచ్చినట్టవుతుంది.భూ సేకరణ చట్టంలో అత్యంత కీలకమైన 'సమ్మతి'పైనే ఈ ఆర్డినెన్స్‌ వేటు వేసింది. సమ్మతి అక్కర్లేదంటే గతంలో మాదిరిగా బలవంతపు భూ సేకరణ జరపొచ్చని చెప్పడమే గదా! సమ్మతి పొందాల్సిన ప్రజల శాతాన్ని 80 నుంచి 67కు తగ్గించాలని కార్పొరేట్‌ శక్తులు గతంలో కోరాయి. కానీ సర్కారు ఏకంగా 'సమ్మతి' అవసరమే లేదని ఆర్డినెన్స్‌ తేవడం ఆశ్చర్యకరం. బహుశా అందుకనే ఆర్డినెన్స్‌ ఆమోదించిన వెంటనే పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లూ హర్షం వెలిబుచ్చారు. సేకరించనున్న భూమిలో ఏ ప్రాజెక్టు నిర్మించేదీ, దాని ప్రభావం, అందుకు కనీసంగా అవసరమైన భూమి మొదలైన వివరాలన్నీ సామాజిక ప్రభావ మదింపు నివేదిక (ఎస్‌ఐఎ)లో ఉంటాయి. కనుక ఆ భూమి భవిష్యత్తు రూపం ఎలా ఉండేదీ, పర్యవసానాలు ఎలా ఉండబోయేదీ ప్రజలకు తెలుస్తుంది. ఇలాంటి అంశాలన్నిటినీ గ్రామసభలో చర్చించాక దాని సమ్మతి మేరకు సేకరణ చేపట్టాల్సి ఉండేది. కానీ ఆర్డినెన్స్‌లో సామాజిక ప్రభావ అంచనా నివేదికే అక్కర్లేదని చెప్పడంతో ఈ ప్రక్రియనంతటినీ గాలికొది లేసినట్టే. సుదీర్ఘ ఆందోళనలు, పోరాటాల ఫలితంగా వచ్చిన భూ సేకరణ, పునరావాస పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం పొందడానికీ పారదర్శకతకు హక్కు చట్టం(2013) ఇక 'కరి మింగిన వెలగ పండు' చందమే అవుతుంది. జాతీయ భద్రత, రక్షణ ఉత్పత్తులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం సహా సామాజిక మౌలిక సౌకర్యాల నిర్మాణం కోసం భూమిని సేకరిస్తే 'సమ్మతి' నిబంధన,  'సామాజిక ప్రభావ మదింపు' వర్తించవని కేంద్ర కేబినెట్‌ ఆర్డినెన్స్‌ ఆమోదించడం అప్రజాస్వామికం, అనైతికం.నీటిపారుదల సౌకర్యం కలిగి బహుళ పంటలు పండే భూములను సేకరించరాదని చట్టం నిర్దేశిస్తోంది. ఆర్డినెన్స్‌లో దాన్ని కూడా తొలగించడంతో చట్టం మరింత నిర్వీర్యం కావడమేగాక ఆహార భద్రతకు పెనుముప్పు కలుగుతుంది. ఇక ప్రజా ప్రయోజనం పరిధిలోకి ప్రైవేట్‌ హోటళ్లతో సహా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులనూ చేర్చడంతో భూ సేకరణ చట్టం బలవంతపు భూ స్వాధీన చట్టంగా మారిపోతుంది.భూ సేకరణ చట్టం (2013) కేవలం భూ యజమానులకు మాత్రమేగాక, ఆ భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, ఇతర పేదల ప్రయోజనాల రక్షణకు వీలు కల్పిస్తుంది. ఆర్డినెన్స్‌ ద్వారా ఆర్థిక పరిహారం కేవలం భూ యజమానులకు మాత్రమే లభిస్తుంది గనుక భూమిపై ఆధారపడి జీవించేవారి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసీముగియగానే బీమా రంగంలో ఎఫ్‌డిఐ పెంపు, బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఆర్డినెన్సులు తెచ్చిన బిజెపి సర్కారు ఇప్పుడీ ఆర్డినెన్స్‌ను చేయడం మరింత దారుణం.

No comments:

Post a Comment