Tuesday 17 February 2015

మోడీ,ఆర్.ఎస్.ఎస్ ల జాయింట్ వెంచర్ ..!

కేంద్రం లో మోడీ ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్ కనుసన్నల్లో నడుస్తోంది.కేంద్ర ప్రభుత్వం,ఆర్.ఎస్.ఎస్ ల మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్.ఎస్.ఎస్ నాయకత్వం వ్యవస్థీకృతం అయ్యింది. ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెని.ఇందులో ప్రధాన వాటాలు ఆర్.ఎస్.ఎస్ వే.ఇలాంటి పరిస్తితుల్లో మోడీ అనుసరిస్తున్న సంక్షేమ వ్యతిరేక ఆర్ధికవిధానాలకు,ఆర్.ఎస్.ఎస్ మతోన్మాద భావజాలానికి వ్యతిరకంగా పోరు కొనసాగించాల్సిన అవసరం వుంది.

భూస్వామ్య,పెత్తందారీ అహంకారానికి నిదర్శనం..

రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద ప్రజానీకాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎంపి జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి, బాధ్యతారాహిత్యానికే కాకుండా రాష్ట్రంలో పాలక పార్టీ విధానాలకు కూడా అద్దంపడుతున్నాయి. ఎన్నికల ముందు ఎవరికైతే ఆపద మొక్కులు మొక్కారో, కాళ్లావేళ్లా పడి.. బాబ్బాబు అంటూ బతిమలాడారో, ఎన్నికలైన తరువాత వారినుద్దేశించే బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. సుఖాల కోసమే పేదలు వలసలు పోతున్నారంటూ చూపిన వాచాలత ఫక్తు భూస్వామ్య భావజాలానికి, పెత్తందారీతనపు అహంకారానికి నిదర్శనం. చుక్కలు దాటి దూసుకుపోతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో రెండు పూటల తిండికి హామీ ఇచ్చే రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవలోవే! ఆ పథకం దారి తప్పుతోందంటే జెసి వంటి పాలకుల అవినీతి, ఆశ్రితపక్షపాతాలే కారణం తప్ప బతుకు బండిని ఈడ్చడానికి నానా కష్టాలుపడే పేద ప్రజలు కాదు.గతంలో టిడిపికే చెందిన మరో ఎంపి గల్లా జయదేవ్‌ ఇదే విధంగా నోరుపారేసుకున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలకు దిగడం, పేదలకిచ్చే సబ్సిడీలను తొలగించాల్సిందేనంటూ ప్రపంచ బ్యాంకు చేస్తున్న హుకుంల నేపథ్యంలో ఆ తానులో ముక్కలుగా మారిన నేతలే ఇటువంటి మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అడ్డగోలు వ్యాపారాలు, స్వార్థ ప్రయోజనాలు, సొంత కుటుంబ ఆస్తుల పెంపే అజెండాగా రాజకీయాలు చేస్తున్న ఈ తరహా నాయకులకు పేదల కష్టాలు అర్థమవుతాయని, వారి కన్నీళ్లను తుడిచి, బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తారని ఆశించడం అత్యాశే!

Friday 13 February 2015

దామాషా ఎన్నిక .. ఎస్.వెంకట్రావ్

ప్రస్తుత ఎన్నికల విధానం మన దేశంలో ఎన్నికలను వ్యాపారంగా మార్చేసింది.ప్రధాన పార్టీ అభ్యర్ధులకే గెలిచే అవకాశాలు ఎక్కువ కనుక ఎన్నికల్లో సీట్లు సంపాదించడానికి అభ్యర్ధులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు.ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో బాగా ఖర్చు చేయగలిగిన వారికే సీట్లు ఇస్తున్నాయి.పోటీ చేసే అభ్యర్ధులు కూడా గెలుపు కోసం ఓట్లను డబ్బిచ్చి కొనేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.దామాషా ఎన్నికల(ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్)విధానంలో అయితే ఒక పార్టీకి దేశం మొత్తం మీద,లేక ఒక ప్రాంతంలో ఎంత శాతం ఓట్లు వస్తే చట్టసభల్లో దానికి అంత శాతం ప్రాధాన్యత లభిస్తుంది. అంటే ఓట్ల శాతాన్ని బట్టి అభ్యర్ధుల శాతం ఉంటుందన్నమాట.దీని వాల్ల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష చాల వరకు చట్ట సభల్లో ప్రతిబింబిస్తుంది.చిన్నచిన్న సామజిక తరగతులకు కూడా తగిన ప్రాధాన్యత లభించే అవకాశం వుంటుంది. అయితే దామాషా ఎన్నికల విధానం కూడా పూర్తి ప్రజాస్వామికం అనుకోకూడదు.ఇవన్నికూడా బూర్జువ ప్రజాస్వామ్యం లో కొన్ని ఎన్నికల వ్యవస్థలు.ప్రజాస్వామ్యం ఒక్క సోషలిస్ట్ వ్యవస్థలోనే పూర్తిగా ప్రజ్వరిల్లుతుంది.ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో పరిమితులను అధిగమించేందుకు,మెరుగైన వ్యవస్థలు రూపొందించుకునేందుకూ కేవలం పోరాడడం ద్వారానే మనం జనతా ప్రజాస్వామ్యం లోకి వెళ్ళగలం.

Thursday 12 February 2015

ఇదే నిజమైన ఐక్యత .. సి.పి.ఐ(ఎం)

వామపక్ష ఐక్యత అంటే ఉమ్మడి వేదికల మీద ఉమ్మడి నినాదాల ప్రాతిపదికపై ఏర్పడే ఐక్యత,ఐక్య ఉద్యమాలు,చర్యల ఆధారంగా ఏర్పడే ఐక్యత. ఇది నెరవేరాలంటే వామపక్ష శక్తులు మరింత ఎక్కువ,లోతైన అవగాహన ఏర్పరుచుకోవాలి.ప్రజా ఉద్యమాల నిర్మాణంలో వామపక్షాల మధ్య మరింత సమన్వయo అవసరం.మతోన్మాద శక్తులకు,మోడీ ప్రభుత్వ నయా ఉదారవాద ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలపక్షాన నిలిచి వారి ప్రయోజనాలు కాపాడే శక్తి ఒక్క వామపక్షాలకు మాత్రమే వుంది.కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలు,గ్రూపులు లౌకికతత్వంపై కేవలం మాటలకే పరిమితం అయ్యాయి.కేవలం వామపక్షాలు మాత్రమే లౌకికతత్వానికి కట్టుబడుతున్నాయనడంలో సందేహంలేదు.

ఆర్ధిక సంక్షోభాలకు మూలకారణం ..

శ్రామికుని శ్రమను దోచుకునే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వున్నంతకాలం పెట్టుబడికి,శ్రమకు వైరుధ్యం వుండి  తీరుతుంది.ఉత్పత్తికి,వినిమయానికి వైరుధ్యం వుంటుంది.సరుకు విలువకూ కొనుగోలు శక్తికి తగాదా నడుస్తూనే వుంటుంది. ఈ వైరుధ్యంలోంచే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్ధిక సంక్షోభాలు తలెత్తుతూ వుంటాయి. నిరంతరం పెరిగే సరుకుల ఉత్పత్తుల విలువకు తగినట్లుగా వాటిని కొనుగోలుచేసే ప్రజల ఆర్ధిక శక్తి పెరగకపోవడమే సంక్షోభాలకు మూలకారణం.ఆ కోనుగోలు శక్తిని ప్రజలకు పెంచేవిధంగా పాలించడం,అందుకు అవసరమైన ఆర్ధిక విధానాలను అనుసరించడమే ఆర్ధిక సంక్షోభాలకు పరిష్కారమార్గం.

కాషాయ పాఠాలు..!

సమాజ మార్పుకు అత్యంత కీలకమైన విద్యారంగాన్ని కాషాయీకరణ చేయడం పైనే బిజెపి,హిందూత్వ శక్తుల కేంద్రీకరణ. బిజెపికి స్వంత మెజార్టీతో వుండడంతో విద్యపై కవ్వింపు చర్యలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరివార్‌ ప్రతినిధులు తలా ఓ ప్రతిపాదన చేస్తున్నారు.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి స్మృతి ఇరానీ తరచుగా మోడీ ఆశలకు అనుగుణంగా విద్యావిధానం మారాలని చెబుతున్నారు.రామాయణం, మహాభారతాన్ని పాఠ్యాంశాలుగా చేర్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఆర్‌ దబే చెప్పారు. భగవద్గీతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. వేదకాలంలోనే వెల్లివిరిసిన సైన్స్‌, గణితాలను పాఠ్యాంశాలుగా బోధించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతవేత్త దీనానాథ్‌ బాత్రా సూచించారు. ఆయన రాసిన పుస్తకాలను గుజరాత్‌లోని పాఠశాలల్లో బోధిస్తున్నారు.విద్యా విధానాన్నే మార్చే పేరుతో చరిత్రను వక్రీకరించటం వంటివి హిందూత్వ ఎజెండాలో భాగాలే.ఒక మతానికి చెందిన సిద్ధాంతాలు, విశ్వాసాలు పాఠ్యాంశాలు అయితే అన్నిమతాలు, కులాల విద్యార్థులు ఒకే తరగతి గదిలో విద్యను అభ్యసించే కామన్‌ స్కూల్‌ విధానం చెదిరిపోతుంది. బాల్యదశలోనే మత ప్రాతిపదికన చీలికలు ఏర్పడతాయి.మత సామరస్యం మంటగలుస్తుoది.బిజెపి అధికారంలో ఉన్నంత కాలం విద్యారంగంలో ఇలాంటి కాషాయ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. 

Tuesday 10 February 2015

అణుప్రమాదం..!

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటనతో బిగిసిన అణు బంధం పెను ముప్పునకు దారితీయనుంది. పౌర అణుసహకార ఒప్పందంలోని అడ్డంకులు తొలగిపోయాయని ఇరు దేశాల నేతలూ ప్రకటించడంతో బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు తలుపులు బార్లా తెరిచినట్లయింది. ప్రమాదభరితమైన అమెరికా కంపెనీల అణు రియాక్టర్లను కొనుక్కుంటే ఎలాంటి భరోసా, బాధ్యత ఆ కంపెనీలకు ఉండనవసరం లేదని మోడీ ప్రభుత్వం లొంగుబాటు వైఖరి ప్రదర్శించింది.తొలి దశలో ఆరు వేల మెగావాట్ల సామర్థ్యం గల శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణు పార్కు ప్రాజెక్టు ఒకటి. ప్రమాదవశాత్తు అణువిస్ఫోటనం జరిగితే ఉత్తరాంధ్ర ప్రజలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అణు ఇంధన, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రియాక్టర్లు ప్రమాదానికి గురైతే నివారణ చర్యలు, పరిహారం చెల్లింపు బాధ్యతలను ఆయా కంపెనీలు తీసుకోవు.వాటి గ్యారంటీ, వారంటీల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మోయడానికి అంగీకరించింది. 2013 భూ సేకరణ చట్టం ఉన్నంతలో ప్రజలకు మేలు చేసేదిగా ఉండేది.గతేడాది డిసెంబరు చివరిలో ఆర్డినెన్స్‌ను తీసుకురావడం, రాష్ట్రపతి ఆమోదం తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి.ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఇక ముందు గ్రామసభల నిర్వహణ, ప్రజాభిప్రాయ సేకరణ ఉండదు. పాత చట్టం ప్రకారం 80 శాతం ప్రజల ఆమోదం ఉండాలి. సామాజిక ప్రభావ మదింపు నివేదిక కూడా ఉండాలి. ప్రస్తుత ఆర్డినెన్స్‌తో ఆ చట్టబద్ధ హక్కులు హరించబడ్డాయి. రైతులకు, భూ యజమానులకు మాత్రమే పరిహారం అందుతుంది. భూమిపై ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు, వృత్తులతో జీవనం సాగిస్తున్న వారికి, మొత్తం గ్రామీణ జీవనంలో మమేకమైన వారికి ఎలాంటి పరిహారం, భద్రత ఉండదని ఆర్డినెన్స్‌ చెబుతోంది.

ఆకలి,దారిద్య్రంలో ఆఫ్రికాను మించిన భారతదేశం..

నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న దేశాలలో భారత్‌ ఒకటని నిరంతరం గుర్తు చేస్తుంటారు.అయితే ప్రపంచంలోనే అత్యంత నిరుపేదలు నివసించే ప్రాంతంగా భావిస్తున్నఆఫ్రికాను కూడా మించి భారతదేశంలోని దారిద్య్రం, ఆకలి ఉన్నదనే విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. దేశంలోని దారిద్య్రం అధికారికంగా వర్గీకరించిన 'అతి తక్కువ అభివృద్ధిచెందిన దేశాలను' మించిపోయింది.ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవటం, దాంతో మార్కెట్‌లో ఎక్కువ ధరలకు కోనుగోలు చేయవలసిరావటం వల్లనే ప్రజల ఆహార వినియోగం తగ్గిందని తెలుసుకోవాలి.ఆహార ధాన్యాల వినియోగం తగ్గితే ఆకలి పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న ఆకలి దారిద్య్రం తీవ్రతకు సంకేతం. విద్య, ఆరోగ్య సేవలను ప్రయివేటీకరించటమే దీనికి కారణం.

సమగ్రాభివృద్దే మా నినాదం ..సిపిఐ(ఎం)

కమ్యూనిస్టు శక్తులకు పెట్టనికోటగా సుదీర్ఘ కాలంపాటు నిలిచిన బెజవాడలో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రాష్ట్ర మహాసభలో ప్రస్తుత పరిస్థితికి తగిన నినాదాన్ని చేపట్టింది.వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న సిపిఐ(ఎం) ఇప్పటికే వివిధ ప్రజాసమస్యలపై మరో తొమ్మిది వామపక్ష పార్టీలతో కలిసి కార్యాచరణ సాగిస్తోంది.ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ సమైక్యతకు నికరంగా కట్టుబడిన ఏకైక పార్టీ సిపిఐ(ఎం).రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశంవంటి వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలనీ, మిగిలిన జిల్లాల్లోని వెనుకబడిన మండలాల అభివృద్ధికి కృషి చేయాలనీ మహాసభ మొట్టమొదటి తీర్మానంలోనే కోరడం పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి నమూనాతో మరింత కేంద్రీకరణ పెరిగి భవిష్యత్తులో ఏర్పాటువాద ఉద్యమాలకు అవకాశం ఏర్పడుతుందని హెచ్చరించడం సరైనదే. 

ఆరుసార్లు ఆతిధ్యం..

సిపిఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు విజయవాడ నగరం ఆరుసార్లు ఆతిధ్యమిచ్చింది.1938లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ ద్వితీయ రాష్ట్ర మహాసభ జరగ్గా.. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1943లో కూడా తృతీయ రాష్ట్ర మహాసభ విజయవాడలోనే జరిగింది. చండ్ర రాజేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సిపిఐ(ఎం) ఆవిర్భావానంతరం 1964లో విజయవాడలో రాష్ట్ర మహాసభ జరిగింది. మోటూరు హనుమంతరావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ రాష్ట్ర 14వ మహాసభ కూడా విజయవాడలోనే జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1988లో రాష్ట్ర 16వ మహాసభ జరగ్గా లావు బాలగంగాధరరావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక య్యారు.తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విజయవాడలో పార్టీ రాష్ట్ర 24వ మహాసభ జరిగింది.రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు ఎన్నికయ్యారు.అలాగే పార్టీ జాతీయ మహాసభలు అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఒకసారి, సిపిఐ(ఎం) ఆవిర్భావానంతరం ఒకసారి జరిగాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ 6వ మహాసభలు 1961లో జరగ్గా, సిపిఐ(ఎం) 10వ మహాసభలు 1982లో జరిగాయి. 1961లో జరిగిన మహాసభ లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ అఖిల భారత కార్య దర్శిగా అజరుఘోష్‌, 1982లో జరిగిన సిపిఐ (ఎం) జాతీయ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ఎన్నికయ్యారు. 2010 ఆగస్టులో పార్టీ అఖిల భారత ప్లీనం విజయవాడలోనే జరిగింది.

మేం కోరుకునే అభివృద్ధి వేరు.. పి.మధు

ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అభివృద్ధి స్వభావం వేరు, మేం కోరుకుంటున్న అభివృద్ధి వేరు. మేం కోరుకునే అభివృద్ధి సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేదిగా ఉంటుంది. ముఖ్యమంత్రి కోరుకుంటున్న అభివృద్ధిలో పెద్దపెద్ద రోడ్లూ, భారీ పర్యాటక కేంద్రాలూ, పెద్ద విమానాశ్రయాలూ ఉన్నాయి. ఇలాంటివి అవసరమే అయినా తక్షణం ప్రజల ఉపాధిని దెబ్బతీయకూడదు. జీవన ప్రమాణాలను పెంచేదిగా ఉండాలి. రాజధాని నిర్మాణం పేరుతో భూములు గుంజుకుంటే వాటి మీద జీవనం సాగిస్తున్న రైతులూ, కూలీలూ ఏం కావాలి?ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించకుండా వారి భూములు లాక్కోవడం సరైనది కాదన్నదే మా వైఖరి.

Monday 9 February 2015

సి.పి.ఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ 24వ రాష్ట్ర మహాసభలు

13 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, 59 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికైంది.సి.పి.ఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు ఎన్నికయ్యారు.

కార్యదర్శివర్గ సభ్యులు :
పి.మధుతో పాటు పాటూరు రామయ్య, ఎస్‌.పుణ్యవతి, ఎం.ఏ,గఫూర్‌, వి.కృష్ణయ్య, వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు, డాక్టర్‌ మిడియం బాబూరావు, ఎం.వి.ఎస్‌.శర్మ, వి.ఉమామహేశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, డి.సుబ్బారావు, సిహెచ్‌.బాబూరావు

రాష్ట్ర కమిటీ సభ్యులు :
బి.వి.రాఘవులు, వై.సిద్దయ్య, బి.తులసీదాస్‌, టి.రవి, ఎస్‌.వెంకట్రావు, మిరియం వెంకటేశ్వర్లు, కె.స్వరూపరాణి, డి.రమాదేవి, పి.జమలయ్య, పి.మురళీకృష్ణ, వంగల సుబ్బారావు, పి.రోజా, జుత్తిగ నర్సింహమూర్తి, జె.జయరాం, వి.వెంకటేశ్వర్లు, బి.కృష్ణమూర్తి, మంతెన సీతారాం, ఆర్‌.రఘు, జాలా అంజయ్య, సిహెచ్‌.రాజగోపాల్‌, కె.కుమార్‌రెడ్డి, బి.నారాయణ, జి.ఓబులు, కె.ప్రభాకరరెడ్డి, టి.షడ్రక్‌,తమ్మినేని సూర్యనారాయణ, కె.లోకనాథం, బి.గంగారావు, కిల్లో సురేంద్ర, డి.శేషబాబ్జి, బి.బలరాం, చింతకాయల బాబూరావు, డి.వి.కృష్ణ, పాశం రామారావు, గద్దె చలమయ్య, పూనాటి ఆంజనేయులు, కె.మురళి, కె.ఆంజనేయులు, వి.రాంభూపాల్‌, ఎన్‌.రంగారావు, వెంకటేశ్వరరావు, పి.ప్రభాకర్‌, ఎ.మాల్యాద్రి, ఆర్‌.లక్ష్మయ్య, కె.ధనలక్ష్మి, సుబ్రహ్మణ్యం.23 మంది జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఎంపికయ్యారు.

ప్రత్యేక ఆహ్వానితులు :
జక్కా వెంకయ్య, సింహాద్రి శివారెడ్డి, ఆర్‌.సత్యనారాయణరాజు, సిహెచ్‌.తేజేశ్వరరావు

కంట్రోల్‌ కమిషన్‌ :
బి.ఆర్‌.తులసీరావు, వి.ఎస్‌.పద్మనాభరాజు, కె.హరికిషోర్‌

Thursday 5 February 2015

పార్టీ బలోపేతమే లక్ష్యం.. సిపిఐ(ఎం)

లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి.మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నయా సరళీకరణ ఆర్థిక విధానాల అమలుతో పాటు హిందుత్వ సంస్థలు తమ మతతత్వపు అజెండాను దూకుడుగా ముందుకు తీసుకొస్తున్నాయి.వీటికి వ్యతిరేకంగా పోరాడటం,పార్టీ స్వతంత్ర శక్తిని పెంపొందించడం పార్టీ ప్రధాన లక్ష్యం. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సిపిఎం స్వతంత్ర పాత్రతో వామపక్ష ప్రజాతంత్ర కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బుర్జువాపార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయం కాగలదు. అన్ని వామపక్షాలను ఐక్యం చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది.


Tuesday 3 February 2015

గిల్లి జోకొట్టే కుటిలత్వం..

వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ 'గిల్లడం, ఆ తర్వాత జోకొట్టడం' బిజెపి, ఇతర సంఘపరివార్‌ శ్రేణులకు పరిపాటిగా మారింది. 'హిందూ రాష్ట్ర', 'ఘర్‌ వాపసీ' 'లవ్‌ జిహాద్‌' వగైరాలతో గిల్లే పాత్రను ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ లాంటి పరివార్‌ సంస్థలు పోషిస్తూ ఉంటే, జోకొట్టే పాత్రను బిజెపి పోషిస్తోంది.సంఘపరివార్‌ శ్రేణులు చేపట్టిన 'ఘర్‌ వాపసి',మత మార్పిడులను నిషేధించాలన్న బిజెపి వాదాన్నీ ఇలాగే అర్థంచేసుకోవాలి. ఒకవైపు ఘర్‌ వాపసీ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. అందులో బిజెపి ఎంపిలు, నేతలు కూడా వుంటారు. అయినా సరే పార్టీ, ప్రభుత్వం వాటితో తమకు ఏమాత్రం సంబంధం లేనట్టు నటిస్తాయి. మత మార్పిడులపై చర్చ జరగాలన్న వాదాన్ని ముందుకు తెస్తాయి. పరివార్‌ శ్రేణులు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే అజెండాను ముందుకు తెస్తుంటే,అమిత్‌ షా మత మార్పిడుల వల్ల మీ ఇంటికి నీరు,విద్యుత్తు రాకుండా ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఇది బిజెపి పరోక్ష సమర్థనకూ అద్దంపడుతుంది.