Monday 10 August 2015

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

గత 25 సంవత్సరాలుగా దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలో పరిశ్రమలు స్థాపించి, ఉపాధి కల్పించటానికి ఉపయోగపడింది లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు షేర్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ లాంటి త్వరగా లాభాలు సంపాదించుకోవటానికి అవకాశమున్న రంగాల్లోకి మాత్రమే వచ్చాయి. భారతదేశంలో సరుకులను ఉత్పత్తి చేసి అమ్మి లాభాలు చేసుకోవడం కంటే, తమ స్వదేశాల నుంచి నేరుగా సరుకులను దిగుమతి చేసుకొని తమ దేశాల్లో ఉపాధిని కాపాడుకోవడంపైనే విదేశీ కంపెనీలు కేంద్రీకరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు ప్రపంచమంతటా ఇవే విధానాలను అమలు చేస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థలు, బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ దేశంలోనూ, విదేశాల్లోనూ అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని వెలికితీసి దేశంలోకి రప్పించినా, శతసహస్త్ర కోటీశ్వరుల సంపదపై ఆంక్షలు పెట్టినా ప్రభుత్వానికి కావాల్సినన్ని పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి. అలాంటి చర్యలు తీసుకోకుండా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన ఫలితాలు రావు. విదేశీ పెట్టుబడి రావాలంటే స్వదేశంలో కార్మికవర్గాన్ని అణచివేయాలనే ఆలోచనే పరమ దుర్మార్గమైంది. బిజెపి ఈ దుర్మార్గానికి సిద్ధంగా ఉన్నది. మోడీ ఇప్పటికే 23 దేశాలు తిరిగి, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని, అన్ని విధాలా సహకరిస్తామని వారి ముందు మోకరిల్లి కోరారు. ఈ సంవత్సర కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వసంస్థల అమ్మకం-మొదటికే మోసం
మోడీ ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ.43 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను ప్రయివేటువారికి అప్పగించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.69 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇన్సూరెన్స్‌ రంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ ఆర్డినెన్సు జారీ చేసింది. రైల్వేలలోనూ, రక్షణరంగంలోనూ నూరు శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని ఒక విధాన నిర్ణయం చేస్తామని చెబుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ రకంగా విదేశీ పెట్టుబడులకు లొంగిపోవడం ఎప్పుడూ జరగలేదు. అందుకే సెప్టెంబర్‌ 2 సమ్మెలో కార్మికవర్గం ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పష్టమైన వైఖరి తీసుకున్నది.
- ఎంఎ గఫూర్‌

No comments:

Post a Comment