Saturday 25 July 2015

ప్రాంతీయవాదం-ప్రజలపై భారం..

కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిందంటూ సంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర పాలకుల తీరు సంతోషంలో చావు మరిచిపోయి నట్లున్నది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాల ప్రజలపై, గడిచిన సంవత్సర కాలంలో వందల కోట్ల రూపాయల భారం మోపిన విషయం పాలకులకు గుర్తురావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. చెయ్యని వాగ్దానాలు అమలు జరుపుతున్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తిగా అమలు జరపలేదు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాయితీల పేరుతో వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు జీత, బత్యాలు పెంచి ఖాజానాపై కోట్ల రూపాయల భారం వేశాడు. మంత్రులు, ముఖ్యమంత్రి విదేశీ, స్వదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.
             రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాజధాని నిర్మాణం, 13 జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్లు లాంటి అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేర్చడంలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారు. కొత్తగా నిర్మించబోయే రాజధాని నగరం చుట్టూ మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రజలందరిపై దాదాపు రూ.1,000 కోట్ల పన్నుల భారాన్ని వేయడానికి పథకం తయారు చేసినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన మమకారంతో కాబోలు ఆయన కేంద్ర ప్రభుత్వంపై మెతక వైఖరి అవలంబిస్తున్నారు.
             గత సంవత్సరం సకాలంలో తగినంత వర్షాలు కురవక పోవడంతో పాటు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు రుణాలు సకాలంలో రద్దు కానందున రైతులకు బ్యాంకులు కొత్తరుణాలు ఇవ్వలేదు. ప్రకృతి నిరాదరణ, ప్రభుత్వ అసమర్థత వల్ల గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం వల్ల పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలు దెబ్బతిని చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాలు వేస్తున్నది. గత నాలుగు నెలల క్రితం దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు అదనంగా రూ.4ల పన్ను (వ్యాట్‌) పెంచాడు. వ్యవసాయానికి డీజిల్‌ ఇంజన్లను ఉపయోగించే రైతులు, ప్రజలను గమ్యానికి చేర్చే వాహనదారులపై పెను భారం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీజిల్‌పై పన్నులు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి.

No comments:

Post a Comment