Friday, 24 July 2015

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 
                ఈ వారం రోజులూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ పరస్పర వివాదాలూ, సవాళ్లతోనే నడిచాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకూ పాకాయి. అయితే ఈ మొత్తం తతంగంలో ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్రాల దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించిన అంశాలేమైనా పరిష్కారం నోచుకున్నది లేదు. ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రుల వాగ్ధోరణులు శ్రుతి మించి చివరకు ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి చేరాయి. ప్రాజెక్టుల నుంచి శాంతిభద్రతల వరకూ ప్రతిదీ ఎడతెగని ఘర్షణ వాతావరణానికే దారి తీశాయి. మొదటి ఏడాది పూర్తి చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎంతమాత్రం మేలు చేయని అవాంఛనీయ పరిస్థితి ఇది. మొత్తంపైన తెలుగు ప్రజలు సుహృద్భావం నిలబెట్టుకున్నా పాలకులు, పాలక పక్షాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రెచ్చగొట్టడమే ధ్యేయంగా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం.
తెలకపల్లి రవి

No comments:

Post a Comment