Friday 22 May 2015

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి..

ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల గురించిన చర్చ గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ ప్రముఖ వస్తు తయారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ చెప్పటం లేదు. గణనీయమైన సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించిన భయాలు వారికెందుకు ఉండాలి? అంతేకాక గత 15 సంవత్సరాల్లో ఉద్యోగుల నియామకం తగ్గిన విషయాన్ని కూడా ఈ పత్రం ప్రస్తావించలేదు. సిఐఐ, అసోచెమ్‌ల విజ్ఞాపన పత్రం తప్పించుకునే ఉద్దేశంతో సమర్పించింది. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్న హామీని అది ఇవ్వలేదు. పైగా ''ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉండే సమైక్య, సమగ్ర సమాజాన్ని పారిశ్రామిక రంగం కోరుతున్నది అని, అభివృద్ధిని, ఆర్థిక పెరుగుదలను, పోటీతత్వాన్నీ పెంచుకునే సమాజంగా ఉండాలి'' అన్న వాదనను ముందుకు తెచ్చింది. అంటే సామాజికంగా వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన ్లను నిరాకరిస్తోంది. ఇంతటితో ఆగకుండా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించ వచ్చునని చెప్పింది. స్వాతంత్య్రం అనంతరం ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ విద్యావకాశాలకు దూరమైన ఎస్టీ, ఎస్సీలకు ప్రైవేటు రంగం చేసిన సేవలు అత్యల్పం. మన సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ప్రాథమిక హక్కులు లేవు. దీనిని ఈ పత్రం కావాలనే విస్మరించింది. ఇలాంటి పరిస్థితిలో అణగారిన తరగతులకు విద్యావకాశాలు లభించగల వనడం భ్రమే అవుతుంది. నిజానికి ప్రాథమిక విద్య సైతం ఎస్సీ, ఎస్టీలకు అందని ద్రాక్షగా మిగిలింది. 
పెనుమల్లి మధు

No comments:

Post a Comment